మీరే చాలా ఫాస్ట్‌గా ఉన్నారు - డల్లాస్ ప్రవాసాంధ్రులతో లోకేష్

Featured Image

గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసి రాష్ట్రానికి, చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారానికి అందుకు వారికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఏపీ ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ అన్నారు. శనివారం సాయంత్రం డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటరులో నిర్వహించిన ప్రవాసాంధ్రుల సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. మీరంతా ఎన్నారైలు కాదు ఎమ్మారైలు(మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్) అంటూ లోకేశ్ చేసిన ప్రసంగానికి ప్రవాసుల హర్షాతిరేకాలు మిన్నంటాయి. ప్రతిపక్షాన్ని కేవలం 11సీట్లకే పరిమితం చేసిన ప్రవాసుల కృషిని ఆయన కొనియాడారు.

భారత జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం లోకేశ్ ప్రసంగించారు. తాను వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకులో పనిచేశానని, స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్నానని, ఒక ఎన్నారైగా ఉండే సాధకబాధలు తనకు తెలుసునని ఆయన అన్నారు. అమెరికాలో ప్రస్తుతం ప్రవాసాంధ్రులకు కష్టకాలం నడుస్తోందని ఎదురుదెబ్బలకు తలొగ్గకుండా ముందుకు నడవాలని సూచించారు. మంగళగిరిలో ఓడిపోయిన తాను కసితో పట్టుదలగా పనిచేసి గెలిచానని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం కంప్యూటింగ్ సమావేశానికి పిలిచినప్పుడు తనకు దాని గురించి ఒక్కముక్క తెలియకపోతే చాట్‌జీపీటీ వాడి తెలుసుకున్నానని లోకేశ్ అన్నారు. 75 ఏళ్ల వయస్సులో సీఎం స్పీడు చూసి అందరిలాగా తాను కూడా దాన్ని అందుకునేందుకు కష్టపడుతున్నానని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తాను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యటిస్తున్నానని, 20లక్షల ఉద్యోగాల కల్పనలో తాము ముందు వరుసలో ఉన్నామని అన్నారు. ఎక్కడైనా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది గానీ ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉందని పేర్కొన్నారు. స్పీడుకి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ అని లోకేశ్ పునరుద్ఘాటించారు.

ప్రతి జిల్లాలో కూటమి గెలుపొందిన స్థానాలు ప్రకటించే ముందు ఆయా జిల్లాలకు సంబందించిన ప్రవాసాంధ్రులు చేతులు ఎత్తాలని లోకేశ్ కోరారు. కృష్ణా-గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల పోటాపోటీ కేకలతో సభాప్రాంగణం మోతమోగింది. ప్రకాశం జిల్లాను పిలవలేదని సభికులు సూచించగా, విశాఖ-ప్రకాశం జిల్లాలు తెదేపా గౌరవాన్ని నిలబెట్టాయని ప్రశంసించారు.

పవన్ కళ్యాణ్ అంటున్నట్లు కూటమి ప్రభుత్వం 15-20ఏళ్లు అధికారంలో ఉండాలని, అధికార మార్పిడి లేకుండా ఒకే ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగితే గుజరాత్ లాగా ఏపీ కూడా సుస్థిరాభివృద్ధిలో దూసుకెళ్తుందని లోకేశ్ వెల్లడించారు. కూటమిలో విడాకులు ఉండవని లోకేశ్ కుండబద్ధలు కొట్టారు. ఏపీఎన్ఆర్‌టీ ద్వారా విద్యార్థులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని లోకేశ్ తెలిపారు.

నిర్వాహకులు ఆశించినంత మేర అతిథులు హాజరు కానప్పటికీ వచ్చినవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. లోకేశ్ ప్రసంగిస్తుండగా హాజరైన కార్యకర్తలు తోట చంద్రయ్య, ఎర్రబుగ్గ, అంజిరెడ్డి వంటి వారి గురించి సూచించగా తనకన్నా అతిథులే చాలా ఫాస్ట్‌గా ఉన్నారని లోకేశ్ నవ్వులు పూయించారు. ఏ పార్టీలో ఉన్నా మహిళలను కించపరిస్తే సహించేది లేదని, తన తల్లిని అవమానించిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

గార్లాండ్ మేయర్ డిలన్ హెడ్రిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబరు 6వ తేదీని గార్లాండ్ నగరంలో నారా లోకేశ్ దినోత్సవంగా ప్రకటించారు. ఎన్నారై తెదేపా సమన్వయకర్త కోమటి జయరాం, డా. వేమూరు రవికుమార్‌లు ప్రసంగిస్తూ లోకేశ్ వంటి యువనాయకత్వం రాష్ట్రానికి అవసరం అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌కు హైటెక్ సిటీకి తీసుకుని వస్తే లోకేశ్ విశాఖకు గూగుల్ డేటా సెంటరును తెచ్చారని వెల్లడించారు. కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు తెదేపా జెండాలతో మాంచి సందడి చేశారు.

లోకేశ్ బస చేసిన వెస్టిన్ హోటల్ వద్ద జనసేన, భాజపా శ్రేణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెదేపా కార్యకర్తలతో ఏర్పాటు చేశిన సమావేశంలో సీఎం లోకేశ్ అంటూ ఒక అభిమాని చేసిన నినాదానికి స్పందిస్తూ అలా అంటూ తన ప్రస్తుత ఉద్యోగాన్ని ఊడగొట్టకండి అని లోకేశ్ సరదాగా అన్నారు. అందరికీ బాలయ్య గానీ తనకు ముద్దుల మావయ్య అని తన ప్రసంగం జై బాలయ్య, జైహింద్‌లతో లోకేశ్ ముగించారు. శనివారం రాత్రి ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోకు పయనమయ్యారు. సోమ, మంగళవారాల్లో అధికారిక పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించే సమావేశాల్లో పాల్గొంటారు. కెనడాలోని టొరొంటోలో కూడా ఈ విధమైన సదస్సులో పాల్గొననున్నారు.

కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుండే గాక కెనడా నుండి కూడా ప్రవాసాంధ్రులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మండువ సురేష్, మండువ సతీష్, జాస్తి శివ, రామ్ యలమంచిలి, కేసీ చేకూరి, కొణిదెల లోకేశ్ నాయుడు, దిలీప్ చండ్ర, జాస్తి శ్రీతేజ, సాయి మద్దిరాల, పురుషోత్తమచౌదరి గుదె, సాయి బొల్లినేని, ఠాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, సుమంత్ పుసులూరి, సూర్య బెజవాడ, గొర్రెపాటి చందు, రామ్ గుళ్లపల్లి, బొర్రా విజయ్, రాజా సూరపనేని, రఘు యెద్దులపల్లి, సుగణ్ చాగర్లమూడి, శ్రీనాథ్ రావుల, వినోద్ ఉప్పు, దొడ్డా సాంబా, యాష్ బొద్దులూరి, కిషోర్ చలసాని, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన తదితరులు పాల్గొన్నారు.

Tags-AP IT Minister Nara Lokesh Speech In Meeting With Telugu Diaspora

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles