🕑 Published: July 15, 2026 at 06:00 AM CST
జులై 31 నుండి ఆగష్టు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు మేరీల్యాండ్లోని బాల్టిమోర్లో నిర్వహించనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాసభలకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు ప్రవాసులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వైద్య నిపుణులు, యువత హాజరుకానున్నారు. 70 కమిటీల ద్వారా వందలాది మంది వాలంటీర్లు ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ తెలిపారు. 1991లో ప్రారంభమైన ఆటా గత 35 సంవత్సరాలుగా తెలుగు సంస్కృతి, సామాజిక సేవ, విద్య, వైద్యం, యువత అభివృద్ధి, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఆటా ఫౌండేషన్ ద్వారా మాతృభూమిలో విద్య, వైద్యం, వరదలు, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో విశేష సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రవాసులు ఈ సంబరంలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సాహిత్య, విద్యా, వైద్య, అలుమ్ని, బిజినెస్ రంగాలకు చెందిన సెమినార్లను ఈ వేడుకల్లో ఏర్పాటు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులతో నెట్వర్కింగ్ సెషన్లు, వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు ప్రభావంపై చర్చాగోష్ఠి, ఆటా మ్యాట్రిమోనీ ద్వారా వివాహ పరిచయ వేదిక వంటివి నిర్వహించనున్నారు. శివపార్వతుల కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నిరావాల్ బ్యాండ్ లైవ్ కాన్సర్ట్, ఆటా బ్యూటీ పేజెంట్, యూత్ ఫ్యాషన్ షో, అష్టావధానం, సాహిత్య సదస్సులు, యూత్ క్రూయిజ్, జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వెండర్ బూత్లు సందడి చేయనున్నాయి. వైవిధ్యభరితంగా సాగే ఈ సభలను విజయవంతం చేయవల్సిందిగా ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, తదుపరి అధ్యక్షుడు సతీష్రెడ్డిలు ఒక ప్రకటనలో కోరారు.



