🕑 Published: July 06, 2026 at 10:08 AM CST
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక "నెల నెలా తెలుగు వెన్నెల" 227వ సాహిత్య సదస్సు డాలస్లోని టెక్సాస్ నగరంలో జూన్ 21న ఘనంగా నిర్వహించారు. "తెలుగదేల యన్న" అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సుకు పారుపల్లి కోదండరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరితో తెలుగు భాష అంతరిస్తున్న సూచనలు మన కళ్లముందే ఆవిష్కృతమవుతోందని, ఈ విషయాన్ని యునెస్కో గణాంకాలతో సహా తేల్చి చెప్పిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాలానుగుణంగా అందుబాటులో ఉండే తాటి ముంజెలు, సీమ చింతకాయలు, జాన కాయలు, కలే కాయలు వంటి వృక్ష ఆధారిత ఫలాలు, మన పూర్వీకుల నుంచి పండుగల వేళ తయారు చేసే ఆవిరి కుడుములు వంటి పిండి వంటలు, ఇంట ముంగిట ముగ్గులు వేసి అందంగా అలంకరించడానికి సాయపడే తంగేడుపూలు వంటివి పశ్చిమ దేశాల వారికి తెలియనందువల్ల ఇక్కడ పెరిగిన మన వారసులకు ఆ తెలుగు పేర్ల పదాలు తెలిసే అవకాశమే లేదన్నారు. సరికొత్త ఆంగ్ల పదాల ప్రభావం, సామాజిక మార్పుల వల్ల మన తెలుగు భాషలోని ఎన్నో అచ్చమైన, అర్థవంతమైన పదాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మనం బంధువులను పిలిచే సమయంలో ఉపయోగించే నాయన, అయ్య, తల్లి, అమ్మ, అవ్వ, అత్త, అత్తయ్య, తోడికోడలు, మేనమామ, మామయ్యలకు బదులు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్ వంటి పిలుపులే వినబడుతున్నాయి. తమిళనాడు, కేరళ, నాగాలాండ్, మిజోరం వాసులు తమ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నారని, మన తెలుగు భాషా రాష్ట్రాల పాలకుల అలసత్వం కారణంగా మాతృభాషకు ఆ ప్రాధాన్యం దక్కడంలేదన్నారు. ఇక నుంచి ఆంగ్ల భాషా పదాలకు బదులుగా తెలుగు పదాలను వాడతామని, న్యాయస్థానాలతో సహా అన్ని శాఖల ఉత్తర్వుల్లోనూ తెలుగును విధిగా వాడాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులకు ఈ-మెయిల్లో విజ్ఞాపనలు పంపిస్తామని అందరితోనూ ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్య అతిథికి సన్మానం చేసి సన్మాన పత్రాన్ని జ్ఞాపికగా అందజేశారు.
