🕑 Published: July 23, 2026 at 10:43 AM CST
తెలంగాణా గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు సహకరించాలని తెలంగాణా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. కాలిఫోర్నియాలో పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్లోని స్వదేశి డిస్ట్రిక్ట్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఆయన కృషికి చేయూతగా ప్రవాసులు పెట్టుబడులు పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, ఉపకారవేతనాలు, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన వంటివాటి ఏర్పాటుకు చొరవగా ముందుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తెలంగాణా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఢిల్లీలో సీజేపీ విద్యార్థులకు మద్దతుగా రాహుల్గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు సందీప్ వంగల, నెమలి మాధవ, శ్రీనివాస్ రామసహాయం, గూడూరు రవీందర్ రెడ్డి, గీతా చౌదరి తదితరులు పాల్గొన్నారు.



