🕑 Published: July 19, 2026 at 01:24 PM CST
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఐదో రోజు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహణ
అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఐదో రోజు అత్యంత వైభవంగా, భక్తిపూర్వక వాతావరణంలో కొనసాగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగశాలలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఉదయం కార్యక్రమాలు గోమాత పూజతో ప్రారంభమయ్యాయి. అనంతరం వేద పండితులు మహాన్యాస పారాయణం, రుద్ర హోమం, అలాగే నవగ్రహ హోమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాల అంతా వేదమంత్రాల ఘోషతో మార్మోగిపోయింది. మధ్యాహ్నం చండీ పారాయణం, చండీ హోమం అనంతరం దుర్గాదేవి, సరస్వతీదేవి, గాయత్రీదేవి, మహాలక్ష్మీదేవికి వెయ్యి కమలాలతో సహస్ర కమలార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశిష్ట పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు.
వెయ్యి మంది భక్తులతో సామూహిక రుద్రాభిషేకం నిర్వహించడం ఈరోజు కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుద్రాభిషేకంలో పాల్గొనే ప్రతి భక్తికి ఆలయ యాజమాన్యం ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన శివలింగంతో పాటు అవసరమైన పూజా సామగ్రిని అందించింది. వేద పండితులు రుద్ర నమకం, చమకం వేదమంత్రాలను పఠిస్తూ భక్తుల చేత అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఉత్తర అమెరికాలో ఇంత భారీ స్థాయిలో, ఒకేసారి ఇంతమంది భక్తులతో నిర్వహించిన సామూహిక రుద్రాభిషేకం ఇదే తొలిసారిగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అపూర్వ కార్యక్రమం భక్తులందరిలో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాద వినియోగం నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనఏని తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.














