🕑 Published: September 04, 2026 at 09:44 AM CST
పుట్టిన గడ్డపై మమకారం, ప్రజల ఆరోగ్యం పట్ల అంకితభావంతో సొంత గ్రామమైన కారంచేడులో దగ్గుబాటి కుటుంబ సభ్యుల సహకారంతో నాలుగు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చొరవతో ONGC CSR నిధుల ద్వారా లభించిన రూ.3కోట్లకు వారి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ తన సొంత నిధులు మరో రూ.1కోటి వెచ్చించి మొత్తం రూ.4కోట్లతో నాలుగు భారీ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
గ్రామంలోని జయప్రకాష్ నారాయణ చెరువు వద్ద 2 ప్లాంట్లు, హరిజనవాడ చెరువు వద్ద 1 ప్లాంట్ , లైబ్రరీ చెరువు వద్ద ఒక ప్లాంట్ నిర్మించారు. చెరువు నీటిని అధునాతన ఓజోనేషన్ పద్ధతితో పలు దశల్లో శుద్ధి చేసి పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మినరల్ వాటర్ను గ్రామంలోని 3500 ఇళ్లకు ఇంటింటికీ సరఫరా చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, ప్రాజెక్టు నిర్వహణ భాగస్వామి 'రాంకీ' సంస్థ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కారంచేడు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






















