🕑 Published: September 03, 2026 at 01:40 PM CST
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తానా ప్రపంచసాహిత్యవేదిక “తెలుగే మన వెలుగు” అనే అంశంపై ఆదివారం నిర్వహించిన 95వ అంతర్జాల సమావేశం ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమ సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా ఏపీ శాసనసభ ఉప-సభాపతి రఘురామకృష్ణమ్రాజు పాల్గొన్నారు.
రఘురామ మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి తగు విధివిధానాలను రూపొందిస్తామన్నారు. మన తెలుగు భాషకు అద్భుతమైన సేవ చేసిన మహనీయులను, ప్రముఖ వ్యక్తులను మరచిపోకూడదని అందువల్లనే ఉండి ప్రాంతంలో పుట్టిన తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతిశాస్త్రి విగ్రహం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, కొత్తగా కడుతున్న ఒక బ్రిడ్జికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామన్నారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఆంగ్ల భాష ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటూనే తెలుగుభాషను నిలబెట్టుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత గురుతరమైనదని అలాగే ప్రభుత్వం అన్ని శాఖలలోను తెలుగుభాషను వాడాలని, పరిపాలనా భాషగా తెలుగు ఉండాలని, ఆంగ్లంలో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులన్నీ వెంటనే తెలుగులో అనువాదం అయ్యేటట్లు చూడాలని, కనీసం ఐదవ తరగతి వరకు మాతృబాషలో విద్యాభోదన జరగవలసిన అవసరం ఉందన్నారు. మరో అతిథి ఆచార్య డా. శలాక రఘునాధ శర్మ మాట్లాడుతూ ఎన్ని భాషలలోని పదాలనైనా అవలీలగా తనలో మిళితం చేసుకోగల శక్తి గల గొప్ప భాష తెలుగు అని కొనియాడారు. ఏపీ రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు తెలుగు భాషా, సంస్కృతులకు పాటుపడుతున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా పురస్కారాలు, కళారత్న పురస్కారాలు అందజేస్తున్నామన్నారు.
గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీ కాంతికృష్ణ తన ముత్తాత గిడుగు రామమూర్తి ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా తీర్చిదిద్దారన్నారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు డా. మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ తెలుగుకు ప్రాచీన భాష హోదా తెచ్చుకోవడంలో సఫలీకృతం అయినప్పటికీ, కేంద్రప్రభుత్వంనుండి నిధులు తెచ్చుకోవడంలో వెనుకబడే ఉన్నామని అన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు భాషను నేర్పడంలో అధునాతనమైన పద్దతులను వాడాలని సూచించారు.

