🕑 Published: August 27, 2026 at 11:54 AM CST
మిషిగన్ రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రాయ్ తెలుగు అసోసియేషన్ (Troy Telugu Association) 20వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. 2006లో ప్రారంభమైన ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, సభ్యులు–దాతల సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. 1050 మంది సభ్యులు కలిగిన ఈ సంస్థ 20వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 26న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్లూమ్ఫీల్డ్ హిల్స్లో నిర్వహించనున్నారు.
వేడుకల్లో భాగంగా శ్రీనివాస కల్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు, వివాహ పరిచయ కార్యక్రమాలు, యువత–ఆర్థిక అంశాలపై సెమినార్లు, తెలుగు పాటల పోటీ, ఒక నిమిషం రీల్/షార్ట్ వీడియో పోటీలను నిర్వహిస్తున్నారు. పాటల పోటీలో 16 ఏళ్లలోపు పిల్లలకు, 16ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. Passing Our Culture to New Generations అనే అంశంతో రీల్/షార్ట్ వీడియో పోటీని నిర్వహిస్తున్నారు. పోటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారతదేశంలోని అవసరాల్లో ఉన్న మహిళలకు సహాయం చేసే HAND (Human Action for Need and Development) కార్యక్రమానికి అందించనున్నట్లు సంస్థ పేర్కొంది.
కార్యవర్గం, నాయకులు వంటి పరిమితులకు లోబడకుండా ట్రాయ్ తెలుగు సంఘం కేవలం సభ్యుల చేత నిర్వహించబడే ప్రవాస తెలుగు సంస్థగా గుర్తింపు పొందింది. సభ్యులు, వాలంటీర్లు, దాతల సహకారంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 20వ వార్షికోత్సవ వేడుకలకు St. Martinus University, Smile Centers గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. వేడుకల ప్రాంగణంలో వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, తెలుగు కుటుంబాలు, యువత, పిల్లలను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. అతిథులకు ప్రవేశం ఉచితం. కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు సంస్థ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.





