🕑 Published: August 28, 2026 at 03:38 PM CST
తానా -పాఠశాల ఆధ్వర్యంలో "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భాష ప్రాముఖ్యత, పెద్దల అనుభవాన్ని ఈ తరానికి చేరువ చేయటం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని ఆ విభాగ అధ్యక్షుడు మాగులూరి భాను అన్నారు. మాతృబాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ తానా పాఠశాల వేదికగా ఈ తరం చిన్నారులకు తెలుగు భాషను పలుకు, అడుగు, పరుగు, వెలుగు అనే వార్షిక విభాగాల ద్వారా తెలుగును నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మన తెలుగు మన పిల్లల కోసం అనే నినాదంతో తరాల అంతరాన్ని తగ్గిస్తూ ఈ తరం చిన్నారులకు చేరువ చేసే సత్ప్రయత్నమే "రీ కనెక్టింగ్ ది జనరేషన్స్" అని వెల్లడించారు. సాంకేతిక, కృత్రిమ మేధ రంగాలలో పట్టు సాధిస్తూ పురోగమిస్తున్న మనమంతా మన పిల్లలకు మాతృభాషను నేర్పి పెద్దలతో అనుసంధానం చేయటంలో వెనుకబడిపోతున్నామని వాపోయారు. ఆ అంతరాన్ని పూరించే వారధి ఈ కార్యక్రమమని తెలిపారు.

