🕑 Published: September 01, 2026 at 09:34 AM CST
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన 5కె రన్/వాక్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో శనివారం నాడు ఒమాహాలోని చాల్కో హిల్స్ రిక్రియేషన్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. "Stronger Together – Healthier Together – Better Together"” నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం యోగా స్ట్రెచింగ్తో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం 5కె రన్/వాక్ కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను అమెరికాలో చిన్నారుల అభ్యున్నతికి కృషి చేస్తున్న Completely KIDS సంస్థతో పాటు, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక అవసరాలకు తోడ్పడే సేవా కార్యక్రమాలకు అందించనున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. గురుదత్ పెండ్యాల, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కాశి మక్కంలు హాజరయ్యారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమమైన వ్యాయామం ప్రాముఖ్యతను వివరిస్తూనే, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తాతారావు కోసూరి, రాజేష్ నాయక్వాడి, TSN కార్యనిర్వాహక వర్గం, డైరెక్టర్లు, కోర్ టీమ్ సభ్యులు, వాలంటీర్లు కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు. పురుషుల విభాగంలో ఐదుగురు, మహిళల విభాగంలో ఐదుగురు, 10 సంవత్సరాలు పైబడిన చిన్నారుల విభాగంలో పది మంది, 10సంవత్సరాల లోపు చిన్నారుల విభాగంలో పది మందికి బహుమతులు అందజేశారు.




