🕑 Published: April 08, 2026 at 02:48 PM CST
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటరుతో జట్టు కట్టింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో పరిశోధన సహకారం, నూతన సాంకేతికతలో శిక్షణ, క్యాన్సర్ చికిత్సలో సంయుక్త ప్రజెక్టులు, విద్యార్థుల పరస్పర మార్పిడి వంటి వాటికి మెరుగైన అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ మేరకు బసవతారకం సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా. టీ. సుబ్రహ్మణ్యేశ్వరరావు నెబ్రాస్కాలోని మెడికల్ సెంటరును సందర్శించి అక్కడి ఆంకాలజీ విభాగ అసోసియేట్ డీన్ డా. ఆరె చంద్రకాంత్ నేతృత్వంలోని బృందంతో చర్చలు జరిపి ఒప్పందాలపై సంతకాలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రసంగిస్తూ ఆంకాలజీలో సంస్థల మధ్య పరస్పర సహకారం ప్రాధాన్యమని, ఈ ఒప్పందం ద్వారా యువ వైద్యులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. డా. చంద్రకాంత్ తన వైద్యవృత్తి ప్రారంభ దశలో సుబ్రహ్మణ్యేశ్వరరావుతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. బసవతారకం ఆసుపత్రితో తమ వైద్య కళాశాల అనుసంధానం ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్య అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
అనంతరం నెబ్రాస్కా తెలుగు సమితి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో నాలుగు వైద్య శిబిరాలను బసవతారకం ప్రారంభించాలని సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ అభ్యర్థించారు. తద్వారా క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుదని, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. డా. మాధురి ఆరే, డా. ఫణి తేజ్ ఆడిదం, క్రాంతి, కీర్తి సుధా తదితరులు పాల్గొన్నారు.



