🕑 Published: April 11, 2026 at 07:08 PM CST
తిరుమల తిరుపతి దేవస్థానాల(TTD) శ్రీవారి సేవా సలహా కమిటీ సభ్యునిగా తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. తనకు ఈ కీలక బాధ్యతలు దక్కడం శ్రీవారి కృపగా భావిస్తున్నట్లు సదాశివరావు TNIకు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
శ్రీవారి సేవ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర భక్తులు స్వచ్ఛందంగా తిరుమలకు చేరి ఇతర యాత్రికులకు చేసే ప్రత్యేకమైన సేవా ఉద్యమం. నిత్యం వేలాది మంది భక్తులు ఈ సేవలో పాల్గొంటూ తిరుమలలో యాత్రికులకు సహకరిస్తున్నారు. ఈ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, విస్తరించడం వంటివాటికి ఈ కమిటీలో తన సభ్యత్వం ద్వారా కృషిచేస్తానని సదాశివరావు అన్నారు. అన్నప్రసాదం, ఆరోగ్య సేవలు, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటి కీలక విభాగాలలో సేవలను సమన్వయం చేసి మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, యాత్రికులకు అందజేసే సేవలను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇది ఒక గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని, శ్రీవారి సేవకుల కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేయడం తన ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

