🕑 Published: March 22, 2026 at 11:04 AM CST
ఆస్ట్రియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు పరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పూజలతో ప్రారంభమై, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగాయి. ప్రవాసులు నృత్యాలు, గాన కార్యక్రమాలు, నాటికల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సంప్రదాయ ఉగాది వంటకాలు పులిహోర, బొబ్బట్లు, గారెలు, ఉగాది పచ్చడి వంటివి ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షురాలు కోమటిరెడ్డి శ్రీలత, కార్యదర్శి ఆలల మమత, కోశాధికారి బిల్లా రాజ్కుమార్లు సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మనోజ్కుమార్ మీడియాను సమన్వయపరిచారు.
