🕑 Published: March 23, 2026 at 09:54 AM CST
అన్నదాతలు సంఘటితమై.. సేద్యంలో సాంకేతికత జోడిస్తే లాభాలు సాధించవచ్చని.. ప్రాంతాల వారీగా డిమాండ్ ఉన్న పంటలను ప్రకృతి సాగు విధానంలో పండిస్తూ.. సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైతులకు సూచించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని ‘రైతు నేస్తం’ ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తెలుగు రాష్ట్రాల్లో మిద్దెతోటల పెంపకంలో రాణిస్తున్న 30 మందికి ‘రైతు నేస్తం ఫౌండేషన్, రఘోత్తమరెడ్డి మిద్దె తోటల పురస్కారాలు-2025’ అవార్డులు ప్రదానం చేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 52 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలని ప్రధాని మోదీ సంకల్పించారని, ఇందులో ఎక్కువ శాతం ఏపీ నుంచి ఉండాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ప్రకృతి సాగును వ్యాప్తి చేయడంలో రైతు నేస్తం ఫౌండేషన్ కృషి అభినందనీయమన్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పురుగు మందుల అవశేషాల్లేని కూరగాయలను అందించడమే లక్ష్యంగా మిద్దె తోటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఫౌండేషన్ తరఫున ‘జనరేటివ్ ఏఐ సాంకేతికతతో వాయిస్ ఏజెంట్’ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ‘040-41897777’ నంబరుకు ఫోన్ చేసి, ప్రకృతి సాగు రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. మిద్దె తోటలను కలసికట్టుగా పెంచుకుంటే ఆదాయంతో పాటు ఆరోగ్యం పొందొచ్చని రఘోత్తమరెడ్డి వివరించారు. అంతకుముందు అతిథుల చేతుల మీదుగా మిద్దె తోటల నిర్వాహకులు పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ డైరెక్టర్ యడ్లపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.





