రూ.30 కోట్లకు పరువునష్టం దావా వేసిన తాళ్లూరి-కొల్లా

Featured Image

అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ (భద్రాచలం) ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్‌తో పాటు దానిలో ప్రసారమైన కార్యక్రమంలో తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు రూ.25 కోట్లకు పరువునష్టం దావా వేశారు. విశాఖకు చెందిన డోకి సురేష్‌తో పాటు బీఆర్‌కే న్యూస్ ఛానల్‌కు తన వకీలు ద్వారా నోటీసులు పంపారు. తానా అధ్యక్షుడిగా తాను 2019-21 మధ్య పనిచేశానని..కానీ తానా ఫౌండేషన్‌లో 2022-24 మధ్య తనకు సంబంధం లేని చర్యలను తనకు ఆపాదిస్తూ బీఆర్‌కే న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సురేష్ డోకి అవాస్తవాలు ప్రసారం చేశారని, ఇది తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు దావా వేసినట్లు జయశేఖర్ వెల్లడించారు. ఆయా ప్రసారాల్లో సురేశ్ డోకితో పాటు బీఆర్‌కే న్యూస్ ఛానల్ యాజమాన్యం ఎలాంటి ధృవీకరణ లేకుండా నిరాధార ఆరోపణలను ప్రసారం చేసిందని నోటీసులో పేర్కొన్నారు. తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన గోప్య సమాచారాన్ని తన అనుమతి లేకుండా వీడియోలో బహిర్గతం చేశారని కూడా ఆరోపించారు. తానా ఖాతాల్లో అవకతవకలపై అమెరికా కోర్టుల్లో కేసులు విచారణలో ఉన్నాయని వీడియోలో సురేష్ స్వయంగా పేర్కొన్నారని, అయినప్పటికీ తన ఫోటో వాడి అసత్యాలు ప్రచారం చేశారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసు అందిన వారం రోజుల్లో ఈ అంశానికి సంబంధించిన అన్ని వీడియోలు తొలిగించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతానని జయశేఖర్ తెలిపారు.

*మరో రూ.5కోట్లకు దావా వేసిన తానా మాజీ కార్యదర్శి

డోకి సురేష్‌పై జయశేఖర్‌తో పాటు తానా మాజీ కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు కూడా రూ.5కోట్లకు పరువునష్టం దావా వేశారు. 2023లో శ్రీనివాస్ అనుమోలు అనే వ్యక్తి ద్వారా తనకు సురేశ్ డోకితో పరిచయమైందని నోటీసులో వివరించారు. ఏప్రిల్ 2023 నుంచి జూలై 2024 మధ్య సురేష్ భార్య మధు నిర్వహించే మెక్లీన్ కన్సల్టింగ్ కంపెనీ ఖాతాకు మొత్తం సూమారు రూ.8.5 కోట్లు (10లక్షల డాలర్లు) ప్రామిసరీ నోట్లతో ఐదు విడతలుగా రుణం అందజేశామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2024 వరకు సురేష్ వడ్డీ చెల్లించారని, ఆ తర్వాత అసలు-వడ్డీ రెండూ నిలిపివేశారని నోటీసులో వెల్లడించారు. రుణాన్ని తప్పించుకోవడానికే సురేశ్ తనతో పాటు జయశేఖర్ ఫోటోలు వాడి యూట్యూబ్ ఛానల్‌లో తానా నిధుల దుర్వినియోగం కేసు కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అశోక్ ఆరోపించారు.

*1099 కట్టు కథ

రుణంగా ఇచ్చిన సొమ్మును ఎగవేసేందుకు..సురేశ్, శ్రీనివాస్‌లు గత నవంబరులో తమకు తెలిసిన సంస్థ ద్వారా 2025 నవంబరులో ఐటీ ఫాం 1099 జారీ చేయించారని అశోక్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగం రూపేణా వచ్చే జీతాలకు, ఇతర ఆదాయాలకు మాత్రమే అమెరికా ఐటీ నుండి 1099 జారీ చేస్తారని..ఇది నేరపూరిత కుట్ర అని తన నోటీసులో పేర్కొన్నారు. రుణాన్ని ఆదాయంగా చూపెడితే సొమ్ము ఎగవేసేందుకు ఆస్కారం కలుగుతుందని గుర్తించి తాము డిసెంబరులో సదరు 1099 ఫాంను రద్దు చేయించామని అయినా తప్పుడు ఆరోపణలతో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పరువుకు నష్టం కలిగించినందుకు వారం రోజుల్లో వీడియోలు తొలగించి 10 రోజుల్లో రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కొల్లా పేర్కొన్నారు. ఇరువురు న్యాయవాదులూ వారి వద్ద ఉన్న స్క్రీన్‌షాట్లు, ఇమెయిల్ రికార్డులు, ప్రామిసరీ నోట్లు అన్నీ కోర్టులో సాక్ష్యంగా సమర్పిస్తామని స్పష్టం చేశారు.

*అవన్నీ అవాస్తవాలు - తానా అధ్యక్షుడు నరేన్

తానా నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో యూట్యూబ్ ఛానల్ ప్రసారాలపై, సురేష్ డోకి వ్యాఖ్యలపై ఆ సంస్థ అధ్యక్షుడు డా. కొడాలి నరేన్ సభ్యులకు ఈ-మెయిల్ పంపారు. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు ఆ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయని..వీడియోలో ప్రస్తావించినవి వాస్తవదూరమని స్పష్టం చేశారు.

Tags-Suresh Doki and BRKNews Served Defamation Notice By Talluri Jayasekhar and Kolla Ashok

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles